నిడమనూరు (నల్లగొండ ): కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి(Gutta Sukhender Reddy ) అన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో(Decade Celebrations) భాగంగా శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ నేతలు(Congress Leaders) అధికారం కోసం అర్రులు చాస్తున్నారని, ఆ పార్టీకి అధికారమిస్తే సంక్షేమ పథకాలకు ముగింపు పలుకడం ఖాయమని అన్నారు. నెత్తికి రుమాలు కట్టుకుని ఓ కాంగ్రెస్ నేత అధికారం వస్తే దోచుకుందామని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో 11 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు (CM Candidates)ఉన్నారని, అందులో నల్లగొండ జిల్లా నుంచే ముగ్గురు ఉన్నారని విమర్శించారు.
ఆ పార్టీకి నాయకత్వమే లేదని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. తాను గత ప్రభుత్వాల్లోనూ పని చేశానని, సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అని తెలిపారు. అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం కల్పించడంతోపాటు ప్రజల మేలు కోసం తపిస్తున్న కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు.
ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీసీలకు రుణసాయం, కులాంతర వివాహ లబ్ధిదారులకు ప్రోత్సాహక నగదు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, జడ్పీవైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.