డిండి, జూన్ 4: కృష్ణా జలాల వాటా తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం 9 ఏండ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2880 కోట్లు ఖర్చు చేసిందని, ఆరేడు నెలల్లో నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపడానికి కృషి చేస్తున్నదని తెలిపారు. డిండి ప్రాజెక్టు అలుగు ద్వారా నక్కలగండి ప్రాజెక్టులో 7.5 టీఎంసీల నీటిని నింపుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ 44 కిలోమీటర్లకుగాను 35 కి.మీ. పూర్తి చేసినట్టు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని వివరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ప్రశంసించారు. రైతు బీమా కోసం ఎల్ఐసీ సంస్థకు రూ.3500 కోట్లు చెల్లిస్తున్నదని చెప్పారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలతో ఒరిగేదేమీ లేదని గుత్తా పేర్కొన్నారు.