హైదరాబాద్, ఆగస్టు 29, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ హామీలు అమలు కాకపోతే ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమయ్యే అవకాశమున్నదని పార్టీ నేతలను హెచ్చరించారు. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణ, కొండా సురేఖపై వేటు, పాలనాపరమైన నిర్ణయాలు, తదితర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.
క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తేనే ప్రభుత్వానికి కొత్తదనం వస్తుందని, అసంతృప్త నేతలకు చెక్ పెట్టినట్టవుతుందని చెప్పారు. సామాజిక న్యాయం జరిగేలా లంబాడీ, యాదవ, మున్నూరు కాపు వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని ఆయన సూచించారు.
పార్టీలో ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తీరును గుత్తా తప్పుబట్టారు. ఇక మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో అధిష్ఠానం తక్షణమే చర్యలు తీసుకోవడమే మేలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు మాత్రమే పరిమితం చేయాలని, ఏపీఎల్, బీపీఎల్ వర్గీకరణ స్పష్టంగా ఉండాలని ఆయన సూచించారు. పింఛన్లను రూ.4వేలకు పెంచాలని, రైతు భరోసా పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారు. 22ఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని సూచించారు.