నల్లగొండ: అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తేగించెలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. ఆర్థిక వనరులను కట్టడి చేయాలనే దురాలోచనలో ఉందని చెప్పారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే చర్య అని ఫైరయ్యారు.
కేంద్ర తన పరిధిలో ఉన్న అన్ని శాఖలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నదని, వ్యక్తిగత కక్షకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీలో రాష్ట్రానికి రావలసిన వాటా ఇవ్వడం లేదన్నారు.
ఇప్పటికైనా కేంద్ర వైఖరి మారాలని సూచించారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే అభివృద్ధి చేసి చూపించాలని, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలన్నారు. దానికి విరుద్ధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని వెల్లడించారు. ఐటీ, ఈడీ, సీబీఐలతో బీజేపీ యేతర నాయకులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. సిద్ధాంతపరంగా కేంద్ర పరిపాలన జరగడం లేదని, ప్రజా స్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ప్రజల మన్నన పొందాలని చెప్పారు.