నల్లగొండ: నూతన వ్యవసాయ చట్టాల రద్దు హర్షణీయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అయితే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపైనా కేంద్రం స్పష్టత ఇవ్వాలని, దీనికోసం బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను రెండోసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మహాధర్నాతో చలనం వచ్చి, ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం హర్షణీయన్నారు. కానీ తెలంగాణలో ఎంత మొత్తంలో ధాన్యం కొంటారో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఎఫ్సీఐ కావాలనే గత యసంగిలో సేకరించిన ధాన్యాన్ని తరలించడం లేదని విమర్శించారు. అడ్డగోలు ప్రకటనలు మానుకుని ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు భాద్యతతో వ్యవహరించాలని హితువు పలికారు.