నల్లగొండ, జూలై 14 (నమస్తే తెలంగాణప్రతినిధి): వ్యవసాయం అంటే తెలియని పీసీ సీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్తు పథకంపై దుష్ప్రచారం చేస్తున్నాడని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. కరెంట్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటు న్న రేవంత్కు అసలు కరెంట్ కొనుగోళ్లు ఎలా జరుగుతాయో తెలుసా? అని ప్రశ్నించారు. కేంద్ర సంస్థల నుంచే 70% విద్యుత్తు కొనుగోళ్లు జరుగుతాయని, మిగతాది ఎన్ఎల్డీసీ రోజువారీగా అవసరాల రీత్యా తీసుకుంటుందని, అలాంటప్పుడు అవినీతి జరిగిందనడం రేవంత్ అవివేకానికి నిదర్శనమన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి మాట్లాడారు. బషీర్బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమనడం ఆయన అసత్య ప్రచారానికి నిదర్శనం అన్నారు. విద్యుత్తు స్లాబులు పెంచి కరెంట్ చార్జీలు పెంచాలన్న అప్పటి సీఎం చంద్రబాబు ఆలోచనను మొట్టమొదటగా వ్యతిరేకించిందే కేసీఆర్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలు కూడా ఓ కారణమని చెప్పారు. అలాంటి కేసీఆర్పై ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని ఎవ్వరూ నమ్మరని తెలిపారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణలో ఎకడైనా ఎకరం పంట ఎండిందా? సబ్ స్టేషన్లలో ధర్నాలు జరిగాయా? లోఓల్టేజీతో మోటర్లు కాలిపోయాయా? అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. రేవంత్ మాటలు విని ప్రజలు మోసపోతే తెలంగాణ రైతులకు 3 గంటల కరెంటే గతి అని హెచ్చరించారు.
రేవంత్రెడ్డికి వ్యవసాయంలో ఒల్పట, దాపట, అమాస పున్నాలు కూడా తెలియవని గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే అమెరికాలో ఎకరానికి గంట, మొత్తంగా 8 గంటల కరెంట్ సరిపోతుందంటూ తన అవివేకాన్ని ప్రదర్శించారని అన్నారు. ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవారా నంబర్ వన్ అని, ఆయన అసలు వ్యవసాయమే చేయలేదని అన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తిలా ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియని వెంకట్రెడ్డికి వ్యవసాయం గురించి మాట్లాడే అర్హతలేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థులైన రిటైర్డ్ అధికారుల సేవలు వినియోగించుకుంటుంటే కోమటిరెడ్డికి ఎందుకు మంట అని ప్రశ్నించారు. 82 ఏండ్ల ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండొచ్చు కానీ రిటైర్డ్ అయినా, సమర్థత ఉన్న అధికారుల సేవలు ఎందుకు వద్దో చెప్పాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి పవర్ ప్లాంట్కు కేంద్రం అడ్డుపడుతున్నదని, అవసరమైన అనుమతులు ఇవ్వడం లేదని గుత్తా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ ద్వారానే యాదాద్రితోపాటు భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, అవినీతికి ఎక్కడ ఆస్కారం ఉన్నదో కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.