నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు (Kanti Veluglu) పథకం అద్భుతమైన కార్యక్రమమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఈ పథకం పేద ప్రజలకు గొప్ప వరమని తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో కంటి వెలుగు పథకంలో భాగంగా తనకు మంజూరైన అద్దాలను ఆరోగ్య లబ్దిదారులకు గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్నదని వెల్లడించారు.
రైతులకు రైతు బంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన అద్దాలను కూడా ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొనియాడరని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తుచేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు.