నల్లగొండ: కాంగ్రెస్ (Congress) నాయకులు రైతాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. పొద్దున లేస్తే ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ పనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు సంతోషంగా ఉంటే ఆ పార్టీకి నచ్చడం లేదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతులకు వ్యతిరేకమేనని చెప్పారు. ఇంకా ఆరోపణలు చేయడం పద్ధతి కాదు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy), కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat reddy) లాంటి వాళ్లకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదని విమర్శించారు. బషీర్బాగ్ (Basheerbagh) కాల్పులకు కేసీఆర్ కారణమంటున్న రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్ధమని చెప్పారు. అప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నడో తెలియదని వెల్లడించారు.
ఆ సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు పెంచుతామంటే కేసీఆర్ వ్యతిరేకించారని, ఆ విషయం అందరికి తెలుసన్నారు. ఇప్పుడు రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నాడని, ఆయన ఆరోపణలను ఎవ్వరూ నమ్మరని చెప్పారు. తెలంగాణలో ఎక్కడైనా పంట పొలాలు ఎండాయో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటు కోసం సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు చేశారా అని ప్రశ్నించారు.
ఈ తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో కరంట్ బ్రహ్మాండంగా అందుతుందని చెప్పారు. తెలంగాణ సస్యశ్యామలం అయిందని వెల్లడించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ అందుతున్నట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కరంట్ కొనుగోళ్లలో కుంభకోణం జరుగుతుందన్న మాట హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వం విద్యుత్ను ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఎల్డీసీ నుంచే కరంట్ కొంటున్నదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు కుంభకోణం ఎలా జరుగుతుందని నిలదీశారు. రేవంత్ రెడ్డి గుడ్డ కాల్చి మిదేస్తున్నాడని ఆరోపించారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవారా నంబర్ 1 అని, వ్యవసాయం అంటే ఆయనకు తెలియదన్నారు. ఆయన అప్పుడప్పుడు సొంతూర్లో తోటకు వెళ్లేది సురాపానం కోసమేనని చెప్పారు.
తెలంగాణ విజయాలు ప్రతిపక్షాలకు కనబటం లేదని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతున్నదని, అనుమతులు ఇవ్వడం లేదన్నారు. బీహెచ్ఈఎల్ (BHEL) ద్వారానే యాదాద్రి పవర్ ప్లాంట్ (Yadadri Power Plant) కడుతున్నారని చెప్పారు. బీహెచ్ఈఎల్ను సీఎం కేసీఆర్ (CM KCR) బతికించారని తెలిపారు. కాంగ్రెస్ వస్తే వ్యవసాయం సర్వనాశనం అవుతుందని, తెలంగాణ ఆగమాగం అవుతుందని వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.