హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలతో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. మంగళవారం శాసన మండలిలో ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను అమలు చేయడంలో కేంద్రప్రభుత్వ వైఫల్యాలు’ అనే అంశంపై లఘు చర్చ జరిగింది. చర్చ అనంతరం సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాడల్ స్కూల్ వ్యవస్థను రద్దు చేసిందన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రావట్లేదని ధ్వజమెత్తారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని గుత్తా అభిప్రాయం వ్యక్తంచేశారు.
కాళేశ్వరానికి జాతీయహోదా ఎందుకు ఇవ్వరు? : ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ
ఏపీలోని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టులుగా ఎందుకు గుర్తించట్లేదని ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ ప్రశ్నించారు. మిషన్భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఇవ్వకపోవడం కేంద్ర కుటిల నీతికి నిదర్శనమన్నారు. ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్టును రద్దు చేయడం తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నదని విమర్శించారు.
టీఆర్ఎస్కు స్పష్టమైన రాజకీయ విధానం: ఎమ్మెల్సీ బండా ప్రకాశ్
తెలంగాణ అభివృద్ధిపై, జాతీయ స్థాయిలో రాజకీయ వ్యూహంపై టీఆర్ఎస్కు స్పష్టమైన విధానం ఉన్నదని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ స్పష్టంచేశారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో కొంతకాలం కేంద్రప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించామని గుర్తుచేశారు. ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపి బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రజల ఆశలు వమ్ము చేసిందని ధ్వజమెత్తారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సెంట్రల్ రైల్వేకి కీలకమైనప్పటికీ.. బోడోలాండ్లో ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు బయ్యారానికి అన్ని వసతులున్నా.. పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష : ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్
అధికార ఆపేక్షతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నదని ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు అధికార కాంక్ష తప్పితే.. రాష్ట్ర అభివృద్ధిపై, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తేవడంలో చిత్తశుద్ధి లేదన్నారు.
బకాయిల చెల్లింపులో కేంద్రానిది పక్షపాత వైఖరి: ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు బకాయిలు రూ.17,828 కోట్ల చెల్లింపులో కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఏపీ, తెలంగాణ లేబర్, వెల్ఫేర్ బోర్డులకు సంబంధించిన నిధుల పంపిణీలో రాష్ర్టానికి రావాల్సిన రూ.455.75 కోట్లు, ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి రావాల్సిన రూ.8.64 కోట్లు ఇప్పించడంలో విఫలమైందన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో 335.04 ఎకరాలను సేకరించి, రూ.849.11 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను సమర్పించినా కేంద్రం పెండింగ్లో పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాలకు ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఇవ్వాల్సిన నిధుల్లో ఇప్పటి వరకు రూ.1,350 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు.
కేంద్ర వివక్షపై పోరాటం:ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి
తెలంగాణ పట్ల కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన సమయం అసన్నమైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
ఉద్యమం ద్వారా హక్కులు సాధించుకోవాలి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను అమలు చేయడంలో కేంద్రం వైఫల్యాలపై పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి అభిప్రాయపడ్డారు.