నల్లగొండ ప్రతినిధి, జనవరి 12(నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థనూ చులకనగా చూడరాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శాసన మండలిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపొందిన వారే చట్టసభలకు వస్తారని, ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదని సూచించారు. చట్టసభల గౌరవం మరింత పెరగాలంటే సభ్యుల మధ్య పరస్పర గౌరవాభావం ఉండాలన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారిపై ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక పాత ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరించుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.
ఏదైనా తప్పులు జరిగితే నిష్పక్షపాతంగా విచారణ జరగాలి గానీ, ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం సరికాదని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తరహా కక్షపూరిత చర్యలు తెలంగాణలోకి రావద్దని కోరుకుంటున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిపాలనపై అప్పుడే ఓ అంచనాకు రాలేమని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు గుత్తా అమిత్రెడ్డి నల్లగొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేస్తారని తెలిపారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ప్రజల తాగునీటి ఏర్పాట్లపై దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు. మిషన్ భగీరథ పథకంలో పెండింగ్లో ఉన్న కరెంటు, ఇతర చెల్లింపులు చేయాలని చెప్పారు. నాగార్జునసాగర్లో ఉన్న నీటిని ఏపీ, తెలంగాణ తాగునీటి అవసరాల కోసం జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.