హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేయటంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలు బీసీ కులసంఘాలు ఆనందం వ్యక్తం చేయటంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్వీ నేతలు సంబురాలు చేసుకున్నారు. నల్లగొండ, జయశంకర్భూపాలపల్లి, కరీంనగర్, మెదక్తోపాటు పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీసీల విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్దపీట వేస్తున్నదని ఈ సందర్భంగా కొనియాడారు.
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాప్రదాతగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్ కొనియాడారు. సీఎం కేసీఆర్ సంకల్పం వల్లే బీసీ గురుకులాల సంఖ్య భారీగా పెరిగిందని బీసీదళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. గురుకల విద్యలో తెలంగాణ దేశానికే మాడల్గా మారిందని గొల్లకుర్మ సంఘం జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ చెప్పారు. బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్ తెలిపారు. వందలాది గురుకులాలు ఏర్పాటు చేస్తూ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని వివరించారు.