హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఏటా గురుకుల కాలేజీలు పెరుగుతున్నాయి. 36 శాతం గురుకుల డిగ్రీ కాలేజీలే ఉండగా, ఇవి ఏటా 10వేల మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ఈ ఏడాది కొత్తగా 17 బీసీ డిగ్రీ కాలేజీలు మంజూరయ్యాయి. నిరుడు వరకు ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలు 28, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీలు 22 కాగా, బీసీ డిగ్రీ కాలేజీలు 14 మాత్రమే ఉన్నాయి. మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో సీట్ల సంఖ్య 20వేలకు చేరనున్నది. వీటితో పాటు మరో రెండు అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీలను కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 224 ప్రభుత్వ డిగ్రీకాలేజీలు కాగా, వీటిలో 81 గురుకుల డిగ్రీ కాలేజీలున్నాయి.
ఇప్పటివరకు 80వేల మందే చేరిక
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 1,097 డిగ్రీ కాలేజీలున్నాయి. ఇప్పటివరకు దోస్త్ రెండు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు పూర్తికాగా, 80 వేలకు పైగా విద్యార్థులు మాత్రమే సెల్ప్రిపోర్టింగ్ ఇచ్చారు. మూడో విడత రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండగా, 32,234 మంది విద్యార్థులు వెబ్ఆప్షన్లు ఎంచుకొన్నారు. ఇటీవలే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో పాసైన విద్యార్థులు కూడా డిగ్రీ కోర్సుల్లో చేరుతారని, దీంతో అడ్మిషన్ల సంఖ్య 1.5 లక్షలు దాటుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.