హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ‘రోజురోజుకూ దిగజారుతున్న గురుకులాల దుస్థితి కనిపించడంలేదా రేవంత్రెడ్డీ? నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలతో పదుల సంఖ్యలో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నా మనస్సు కరగడం లేదా? 48 గంటల్లో వరుస విషాహార ఘటనలు మీ అసమర్థ పాలనకు నిదర్శనం కాదా?’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నాస్ర్తాలు సంధించారు. కేసీఆర్ గురుతులను చెరిపేయాలనే కుట్రలతో గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం చారిత్రక నేరమని సోమవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
సంకుచిత మనస్తత్వంతో దళిత, గిరిజన, బడుగు, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకొనే పాఠశాలలకు గ్రహణం పట్టిస్తుండటం దుర్మార్గమని దుయ్యబట్టారు. ‘స్వయంగా మానిటరింగ్ చేస్తానని బీరాలు పలికినవ్, ఆ పర్యవేక్షణ ఏమైంది? విద్యాశాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్న మీరు చేస్తున్నదేమిటి?’ అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ మండలం నాగల్ గిద్ద, నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి, జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్, భద్రాద్రి జిల్లా భద్రాచలం గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే కండ్లు తెరవడం లేదెందుకని నిలదీశారు.
20 నెలల కాంగ్రెస్ పాలనలో పాముకాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్లతో 100 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న రేవంత్రెడ్డి సాధించిందేమిటో అర్థం కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరాన నిలబెడితే రేవంత్ అధఃపాతాళానికి దిగజార్చుతున్నారని మండిపడ్డారు. ‘ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతే మీ రాతి గుండె కరుగుతది? ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల సమస్యలను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.