ఘట్కేసర్ రూరల్/కోరుట్ల, అక్టోబర్ 22: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ-2021)లో గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. అంకుషాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల బుద్వేల్శాఖలో బీఎస్సీ చదివిన మధునాల రాజేశ్వరీ సీపీగెట్ ఫలితాల్లో ఎమ్మెస్సీ ఫిజిక్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మారంపల్లికి చెందిన దినసరి కూలీ రాజశేఖర్గౌడ్ కూతురు రాజేశ్వరి. అదే కళాశాలలో ఎంపీజీ చదివిన చల్లూరి కమల థర్డ్ ర్యాంకు సాధించింది. విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ మాడుగుల వెంకటేశ్వర్లు, అధ్యాపకులు అభినందించి సన్మానించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన మేకల ప్రణతి ఫుడ్ సైన్స్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోలి శ్రీలత తెలిపారు.