TREIRB | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాలయాల్లోని డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు పూర్తిస్థాయి నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొదటి రోజు గంటల్లోనే దాదాపు 10 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని బోధన, బోధనేతర సిబ్బందితోపాటు వివిధ క్యాటగిరీల్లో మొత్తంగా 9,231 ఖాళీల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తొలిదఫాగా డీఎల్, జేఎల్, పీడీ లైబ్రేరియన్ కలిపి మొత్తం 2,876 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది. ఆ వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మే 17వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నదని నోటిఫికేషన్లో ట్రిబ్ వెల్లడించింది.
మల్టీజోనల్వారీగా పోస్టులు.. అర్హతలు
ఆయా పోస్టులకు సంబంధించిన మల్టీ జోన్-1, మల్టీ జోన్-2లో ఉన్న ఖాళీల వివరాలను పాఠ్యాంశాలవారీగా వెల్లడించింది. పోస్టుల భర్తీకి అభ్యర్థులకు విద్యార్హతలను కూడా వెల్లడించింది. డిగ్రీ పోస్టులకు యూజీసీ నిబంధనల మేరకు సంబంధిత బోధన సబ్జెక్టులో 55 శాతం మార్కుల నిబంధనను విధించింది. నెట్/సెట్ అర్హత తప్పనిసరని తెలిపింది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధిత బోధనాంశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్తోపాటు బీఎడ్ చేసి ఉండాలని వెల్లడించింది.
అభ్యర్థులు తప్పనిసరిగా 2017 తరువాత మీ సేవ ద్వారా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే సమర్పించాలని, ఈడబ్ల్యూఎస్ ఆదాయ సర్టిఫికెట్ నంబర్లను అప్లోడ్ చేయాలని ట్రిబ్ తెలిపింది. ఫీజుల వివరాలతోపాటు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ట్రిబ్ వెబ్సైట్లో పొందుపరిచింది. డీఎల్, జేఎల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలైన ఒక్కరోజులోనే ఆయా పోస్టులకు దాదాపు 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇందు లో చాలా మంది ఆన్లైన్ పేమెంట్లను కూడా పూర్తి చేయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మందికిపైగా పోటీపడ వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.