హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను మరచిపోక ముందే తాజాగా తొగుట మండలం రాంపూర్లో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. ఆకుల వంశీ అనే వ్యక్తిపై ఒగ్గు తిరుపతి వర్గీయులు కాల్పులు జరిపారు. వీరిద్దరు దుబ్బాక మండలం చెల్లాపూర్కు చెందిన వారుగా కాగా.. భూ, కుటుంబ తగాదాల నేపథ్యంలోనే కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది.
గతంలో తిరుపతిపై వంశీ హత్యాయత్నం చేశారని, ఈ క్రమంలో హత్య కేసు విచారణ కోసం కోర్టుకు హాజరై తిరిగి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో వంశీపై తిరుపతి వర్గీయులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు తిరుపతిని అదుపులోకి తీసుకొని, సంఘటనా స్థలానికి తీసుకొని వెళ్లి.. ఆ ప్రాంతంలో పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. అయితే, బాధితుడు వంశీకి గాయాలయ్యాయా? అతని ఆరోగ్య పరిస్థితి ఏంటన్న వివరాలు తెలియాల్సి ఉన్నది. తిరుపతి, వంశీ ఇద్దరు బంధువులేనని.. గత కొంతకాలంగా భూ వ్యవహారాలు, కుటుంబ తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే హత్యా యత్నం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.