మెట్పల్లి, జనవరి 27: జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గల్ఫ్ ఏజెంట్ నకిలీవీసాలు చేతిలో పెట్టి అమాయకులను నట్టేట ముంచాడు. ఎయిర్పోర్ట్ నుంచి నిరాశగా ఇంటిముఖం పట్టిన బాధితులు శనివారం ఏజెంట్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. మెట్పల్లికి చెందిన గల్ఫ్ ఏజెంట్ ఏలేటి రమేశ్ దుబాయిలో మల్టీనేషనల్ కంపెనీలో వాచ్మెన్, కార్పెంటర్, లేబర్ ఉద్యోగాలు ఉన్నాయని, నెలకు రూ.40 వేలు జీతం ఉందని, అందుకు ఒక్కో వీసాకు రూ.60 వేలు ఖర్చవుతుందని నమ్మించాడు. దీంతో నిర్మల్ జిల్లా ముథోల్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, జగిత్యాల జిల్లా మల్లాపూర్, మెట్పల్లి మండలాలకు చెందిన సుమారు 63 మంది ఆశాజీవులు ఒక్కొక్కరు రూ.60 వేల చొప్పున అతనికి డబ్బులు ముట్టజెప్పారు.
కొద్ది రోజుల కిందట వారికి వీసా ప్రతులను ఇచ్చాడు. వారిలో కొందరు ఈ నెల 24న దుబాయి వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఆన్లైన్లో తనిఖీ చేయగా అవి నకిలీవి అని తేలడంతో వెనక్కి పంపించారు. ఇది తెలియని మరో ఇద్దరు ఈ నెల 25న దుబాయి వెళ్లేందుకు విసా కాపీలతో అదే విమనాశ్రయానికి వెళ్లారు. అధికారుల తనిఖీల్లో అవి కూడా నకిలీవని తేలడంతో తిరిగి వెనకకు వచ్చారు. ఉపాధి కోసం దుబాయి వెళ్దామనకున్న బాధితులు.. ఏజెంట్ ఇచ్చిన వీసాలు నకిలీవని తేలడంతో ఆందోళన చెందుతున్నారు. మంచి కంపెనీ, మంచి జీతం అని చెప్పి మోసం చేసిన ఏజెంట్పై చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు గల్ఫ్ ఏజెంట్ ఏలేటి రమేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మెట్పల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు.