వరంగల్ : భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ కలెక్టర్లను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అప్రమత్తం చేశారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.
గులాబ్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, ఈ పరిస్థితులలో ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖ సమన్వయంతో కృషి చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.