హైదరాబాద్ : వర్తమాన జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమున్నదని గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింఘ్ వాఘేలా స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలని, అందుకు దేశంలోని తమలాంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకుల సంపూర్ణ మద్దతు కేసీఆర్కు ఉంటుందని శంకర్ సింఘ్ వాఘేలా పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్ను గుజరాత్ మాజీ సీఎం జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించారు.
శుక్రవారం ప్రగతి భవన్లో సుమారు ఐదు గంటల పాటు ఎంతో సుహృద్భావ వాతావరణంలో సాగిన సమావేశంలో పలు జాతీయ స్థాయి కీలక అంశాలపై సీఎం కేసీఆర్, శంకర్ సింఘ్ వాఘేలా సుధీర్ఘంగా చర్చించారు. దేశానికి ఆదర్శంగా అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి తోపాటు దేశంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిస్థితులు జాతీయ అంశాల పై చర్చసాగింది. చర్చలో ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీత పోకడలతో అనుసరిస్తున్న స్వార్థ రాజకీయ క్రీడ దేశ ప్రజలపై, దాని పర్యవసానాలపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, జాతి అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లో కొనసాగుతున్న తమ వంటి సీనియర్ జాతీయ నేతలంతా నేటి బీజేపీ రాజకీయాల పట్ల ఆందోళనతో ఉన్నారని వాఘేలా అన్నారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాలనా, రాజకీయ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని, ఇటువంటి కీలక సందర్భంలో మౌనం వహించడం ప్రజాస్వామికవాదులకు, దేశ ప్రగతి కాములకు తగదన్నారు.
ఈ సందర్భంగా శంకర్ సింఘ్ వాఘేలా మాట్లాడుతూ.. రావు సాబ్.. దేశంలోని ప్రజాస్వామిక ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతూ ప్రస్తుతం కేంద్రంలో ఒక నియంతృత్వ ధోరణి ప్రబలుతున్నది. దీన్నిట్లనే చూస్తూ ఊరుకోలేక, నిలువరించే దిశగా సరియైన వేదిక దొరక్క, మాలాంటి సీనయర్లను ముందుండి నడిపించే నాయకత్వం లేక కొంత ఆందోళనతో ఉన్నాం. ఈ సందర్భంలో చీకట్లో చిరుదీపమై, మీరు కేంద్ర విధానాలను ప్రతిఘటిస్తున్న తీరు మావంటి సీనియర్ నాయకులను ప్రభావితం చేసింది. అనుకున్నదాన్ని సాధించేదాక పట్టిన పట్టు విడవని నాయకుడుగా మిమ్మల్ని ఇప్పటికే దేశం గుర్తించింది. అసాధ్యమనుకున్న తెలంగాణను ఎన్నో కష్టాలకు నష్టాలకోర్చి శాంతియుత పంథాలో పార్లమెంటరీ రాజకీయ పంథా ద్వారా సాధించడం దేశ చరిత్రలో గొప్పవిషయం. సాధించిన రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తూ అనతికాలంలోనే అప్రతిహతంగా ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో ఇంతటి ఘన చరిత్ర మీది మాత్రమే.
విభజనానంతరం తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మిమ్మల్ని అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నాకూడా మొక్కవోని పట్టుదలతో ముందుకు పోతున్న మీ తెగువ నిజంగా మహోన్నతమైనది. మిమ్మల్నే కాకుండా దేశంలోని ప్రతి విపక్ష రాష్ట్రాన్ని భయ భ్రాంతులకు గురిచేస్తూ నియంతృత్వ ధోరణులద్వారా లొంగదీసుకోవాలనే కుట్రలను బీజేపీ అమలు చేస్తున్నది. దేశంలో మత సామరస్యానికీ, ప్రాంతీయ సామరస్యానికీ విఘాతం కలిగిస్తున్న లౌకిక వాద, సమాఖ్యవాద వ్యతిరేక కేంద్ర బీజేపీ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాల్సివున్నది. ఇటువంటి సందర్భంలో ఈ పీడన నుంచి తెలంగాణతో పాటు సహచర రాష్ట్రాల ప్రజలను విముక్తం చేయాల్సిన అవసరం మీకున్నదని మావంటి సీనియర్లమందరం భావిస్తున్నాం. మీరు మీ అనుభవాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయడం కాకుండా భారత దేశానికి విస్తరించాల్సిన సమయం వచ్చింది.
నేను మీ దగ్గరికి రావడానికి ముందే కాంగ్రెస్ సహా పలు పార్టీల్లోని సీనియర్ నాయకులమంతా కలిసి చర్చించుకున్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్న్యాయంగా వుంటుందనుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్నది. దాంతో పాటు బీజేపీ దుర్మార్గాలను ఎదుర్కునేందుకు కావలసిన రాజకీయ వ్యూహాన్ని ఎత్తుగడలను అమలు చేస్తూ అందరినీ కలుపుకుపోవడంలో ఆ పార్టీ విఫలమౌతున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని భావసారూప్య విపక్షాలను కలుపుకుపోయేందుకు మీవంటి నాయకత్వ అవసరం ఎంతో వున్నది. మీ నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాం. మేమంతా కలిసి నిర్ణయించుకున్న తర్వాతే నేను మీతో సమావేశం కావడానికి హైదరాబాద్ వచ్చాను. ఇంకా చెప్పాలంటే వారంతా కలిసే నన్ను మీ వద్దకు పంపారు. మీకు మా అందరి ఔట్ రైట్ మద్దతు ఉంటుంది. మీరు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశ గతిని మార్చాల్సిందిగా కోరుతున్నం. అందుకు మిమ్మల్ని మరోమారు ఆహ్వానిస్తున్నాం అని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ్ వాఘేలా సీఎం కేసీఆర్తో అన్నారు.
ఈ సందర్భంగా వాఘేలా ఆహ్వానానికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను ముఖ్యమంత్రిగా ముందుకు నడిపిస్తూనే, దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పును తేవడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వాఘేలా వంటి సీనియర్ జాతీయ నాయకులు తనకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తన నాయకత్వాన్ని సమర్థించడం పట్ల వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని సీఎం అన్నారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో విజయవంతమయ్యాయి.