హైదరాబాద్, జూన్29 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక, వాణిజ్య, గృహ సముదాయాల్లో భూగర్భ జలాల వినియోగానికి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తీసుకోవడం తప్పనిసరి అని కేంద్ర జల్శక్తిశాఖ మరోసారి నోటిఫికేషన్ జారీచేసింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గనిర్దేశాల మేరకు పట్టణ ప్రాంతాల్లోని నివాస సముదాయాలు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, ప్రభుత్వ నీటి సరఫరా ఏజెన్సీలు, పారిశ్రామిక, మౌలికవసతుల కల్పన, మైనింగ్ ప్రాజెక్టులు, బల్క్ వాటర్ సప్లయ్ ఏజెన్సీలు భూగర్భ జలాల వినియోగానికి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ (సీజీడబ్ల్యూఏ) నుంచి ఎన్వోసీని పొందాలని, ఎన్వోసీ పొందని సంస్థలు భూగర్భజలాలను వినియోగించుకొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గురువారం లోగా ఎన్వోసీ కోసం పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని, సెప్టెంబర్ 30లోగా పూర్తిస్థాయి దరఖాస్తును సమర్పించాలని పేర్కొన్నది. వివరాలకు cgwa.noc. gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.