కరీంనగర్కు చెందిన శ్రీకాంత్కు గృహజ్యోతి పథకం వర్తించింది. అయినా ఈ నెలలో బిల్లు రావడంతో షాక్ అయ్యాడు. అధికారులను అడిగితే 200 యూనిట్లకు అదనంగా 12 యూనిట్లు కాల్చడంతో బిల్లు వచ్చినట్టు చెప్పారు. మరి 12 యూనిట్లకే బిల్లు రావాలి కదా అని ప్రశ్నిస్తే 200 యూనిట్లకు అదనంగా ఒక్క యూనిట్ వినియోగించినా మొత్తం బిల్లు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన శ్రీనివాస్ ప్రజాపాలన దరఖాస్తులో ఇచ్చిన యూఎస్సీ నంబర్ను డాటా ఎంట్రీలో తప్పుగా నమోదు చేయడంతో వేరే నంబరుకు జీరో బిల్లు వచ్చింది. ఆరా తీస్తే ఆ కనెక్షన్ పక్క గ్రామంలో ఉన్నట్టు తేలింది. దానిని మార్చేందుకు సాఫ్ట్వేర్లో ఎలాంటి ఆప్షన్లు లేవు.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రభుత్వం ఆర్భాటంగా అమలుచేస్తున్న గృహజ్యోతి పథకంతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఆంక్షల కారణంగా 40 శాతానికిపైగా కనెక్షన్లకు గృహజ్యోతి అమలుకావడం లేదు. పథకం అమల్లో లోపాల కారణంగా మరో 25 శాతం మంది అర్హత ఉండీ ప్రయోజనం పొందలేకపోతున్నారు.
గృహజ్యోతి పథకానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఎక్కడా కిరాయి ఇండ్లలో ఉంటున్న వారిని ప్రస్తావించలేదు. ఫలితంగా సొంతూరుకు దూరంగా హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాల్లో ఉంటున్న లక్షలాదిమంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తుల గడువు ముగిశాక కిరాయి ఇంట్లో ఉన్నా దరఖాస్తు చేస్తే జీరో బిల్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ తీరుతో ఒకే భవనంలో కిరాయికి ఉంటున్న కొందరికి జీరో బిల్లు వస్తే మరికొందరికి రావడం లేదు. మరికొందరు తాము కిరాయికి ఉంటున్న ఇంటి సర్వీసు నంబరుతో సొంతూరులో దరఖాస్తు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.
మార్చుకునేది ఎలా?
కిరాయి ఇంట్లో ఉండి గృహజ్యోతి పథకాన్ని పొందుతున్నవారు ఏదైనా కారణంతో ఇల్లు మారితే ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయంలోనూ ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. పిల్లల చదువు కోసం కొందరు విద్యాసంస్థలకు దగ్గరగా ఇండ్లు కిరాయికి తీసుకుని ఉంటారు. స్కూళ్లు మారినా, పై చదువుల కోసం వేరే చోటికి వెళ్లినా మళ్లీ అక్కడికి మా రాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటివన్నీ ఏప్రిల్ నుంచి మొదలవుతుంటాయి. ఇల్లు మారినప్పుడు ఏం చేయాలనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది.
అసలు విషయం చెప్పలేదు
గృహజ్యోతి నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం అసలు విషయం మాత్రం దాచిపెట్టింది. 200 యూనిట్లు దాటితే పరిస్థితి ఏంటన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడేమో 200 యూనిట్లకంటే ఒక్క యూనిట్ అదనంగా వచ్చినా పథకం అమలు కాదని అధికారులు తీరిగ్గా సెలవిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 200 యూనిట్లు దాటిన ప్రతి ఒక్కరు మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
సవరణలకు అవకాశమే లేదు
ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో అనేక తప్పిదాలు జరిగాయి. ప్రభుత్వం ఓవైపు హడావుడి పెట్టడం, వేలాది దరఖాస్తులు, కొండంత సమాచారం నమోదు చేయాల్సి రావడంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు తడబడ్డారు. యూఎస్సీ నంబర్లు చాలావరకు తప్పుగా నమోదయ్యాయి. ఫలితంగా కుటుంబానికి రావాల్సిన జీరో బిల్లు మరో కుటుంబానికి వస్తున్నది. వివరాలు సరిచేద్దామన్నా సవరణకు ఎక్కడా అవకాశం లేకుండా పోయింది.
ఖమ్మం జిల్లా బోనకల్వాసి రవికుమార్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రజాపాలనలో భాగంగా సొంతూరులో దరఖాస్తు చేసిన సమయంలో గృహజ్యోతి కోసం తాను కిరాయికి ఉంటున్న ఇంటి యూఎస్సీ నంబర్ ఇచ్చాడు. ఇప్పుడేమో జీరో బిల్లు రావడం లేదు. అధికారులను అడిగితే ఖమ్మంలో దరఖాస్తు చేస్తే ఇక్కడెలా వస్తుందని ఎదురు ప్రశ్నించారు. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న నల్లగొండ జిల్లాకు చెందిన మరో కుటుంబానికి మాత్రం జీరో బిల్లు వచ్చింది.
క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆగ్రహం
ప్రభుత్వం చేసిన తప్పిదాలు క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి తలనొప్పిగా మారాయి. అనేకమంది తమకు జీరో బిల్లు ఎందుకు అమలు కావడం లేదని నిలదీస్తున్నారు. డాటా ఎంట్రీ తప్పులకు మమ్మల్ని బలిచేస్తారా? అని మండిపడుతున్నారు. కొన్నిచోట్ల స్థానిక కాంగ్రెస్ నేతలను కూడా నిలదీస్తున్నారు. దీని నుంచి తప్పించుకునేందుకు వారు ఈసారికి కరెంటు బిల్లు కట్టాని, కోడ్ ముగిశాక జీరోబిల్లు వస్తుందని నచ్చజెబుతున్నారు. మరోవైపు, పెండింగ్ బిల్లుల వసూలుకు వెళ్తే ప్రజలు తిరగబడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు అమలుచేయాలని, పూర్తిస్థాయిలో అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు.