హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన గత ఎనిమిదేండ్లలో నిర్మాణ రంగంలో అద్భుత ప్రగతి సాధించిందని ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ తాజా మాజీ అధ్యక్షుడు ప్రదీప్ మిట్టల్ అన్నారు. హైదరాబాద్లోని రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఈఎన్సీ గణపతి రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ స్టేట్ చాప్టర్ సమావేశానికి ప్రదీప్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టి, ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాలు నిర్మించడాన్ని అభినందించారు. అలాగే సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలనూ అద్భుతంగా నిర్మించారని తెలిపారు. ఇక హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఒక్క పోలీస్ శాఖకే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర సమయాల్లో ఇతర శాఖలు అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా నిర్మించడాన్ని ప్రశంసించారు. ఈఎన్సీ గణపతి రెడ్డి మాట్లాడుతూ.. రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రం ఏర్పడే నాటికి 30 లక్షల చదరపు అడుగుల భవనాలు మాత్రమే ఉండగా.. గడిచిన ఎనిమిదేండ్లలో 120 లక్షల చదరపు అడుగులకు పెంచామని తెలిపారు. తెలంగాణ సచివాలయం, అమరుల స్మృతి వనం నిర్మాణాలు తుది దశలో ఉన్నాయని వివరించారు.