ఖమ్మం, మార్చి 8 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు వీధినపడ్డా యి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా పరిశీలకురాలు కాట్రగడ్డ ప్రసూన ఆ విభేదాలకు ఆజ్యం పోయడం విస్మయానికి గురిచేస్తున్నది. జిల్లాలో కొంతకాలంగా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. బుధవారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రసూన జిల్లా కార్యాలయానికి వచ్చారు.
అయితే టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి, బీసీ నేత కూరపాటి వెంకటేశ్వర్లుకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా, కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కూరపాటి ఫొటో లేకపోవడంతో ఆయన వర్గానికి చెందిన తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల రంజిత్ తదితరులు ప్రసూనను నిలదీశారు. ఆమె ఆగ్రహంతో రంజిత్ను కాలర్ పట్టుకొని బయటకు గెంటేశారు. పరుష పదజాలంతో దూషించారు. ఆగ్రహానికి గురైన కార్యకర్తలు ప్రసూనపై ఎదురుదాడి చేశారు. దీంతో ప్రసూన, కూరపాటి వర్గీయులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. కూరపాటి వర్గీయులను కార్యాలయం నుంచి బయటకు పంపించి లోపల మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె బయటకు రాగా క్షమాపణ చెప్పాలని కూరపాటి వర్గీయులు సుమారు రెండు గంటల పాటు ప్రసూన కారును అడ్డగించారు.