హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 ఫలితాలను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. అక్టోబర్ నెలలో ఫలితాలు ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. వారంలోగా ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్టు తెలిసింది. సోమవారం టీఎస్పీఎస్సీ కమిషన్ సమావేశం జరగనున్నది. అదేరోజు సమావేశం అనంతరం లేదా మంగళవారమే ప్రిలిమినరీ కీ ఇచ్చే అవకాశం ఉన్నది. ఆ తర్వాత అభ్యంతరాలకు 5 నుంచి 7 రోజులు అవకాశం ఇస్తారు. వచ్చిన అభ్యంతరాలపై నిపుణులతో కమిషన్ పరిశీలిస్తుంది. తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. గ్రూప్-4 పరీక్ష రాసిన మొత్తం 7,62,872 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేయాలని కమిషన్ భావిస్తున్నది. రాష్ట్రంలో నవంబర్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అక్టోబర్ నెలలోనే గ్రూప్-4 ఫలితాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు ఆ ఉన్నతాధికారి పేర్కొన్నారు. గ్రూప్-4 క్యాటగిరీలో వివిధ విభాగాల్లో 8,039 ఉద్యోగాల భర్తీకి జూలై ఒకటిన పరీక్ష జరిగింది. 9,51,205 మంది దరఖాస్తు చేయగా, 7,62,872 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రోజుకు సగటున 25 వేల నుంచి 35 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేయగా, ఇప్పటికే స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది.