హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : టీఎస్పీఎస్సీ గ్రూప్-4 దరఖాస్తుల సవరణకు సోమవారంతో గడువు ముగియనున్నది. భారీగా దరఖాస్తులు రావడంతో ఈ నెల 9 నుంచి 15 వరకు అవకాశం కల్పించారు. ఒక అభ్యర్థి దరఖాస్తులోని తప్పులను ఒకసారి మాత్రమే సవరించుకునే అవకాశం ఉన్నదని, సవరించిన ధ్రువీకరణ పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్లో సమర్పించాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు. రాష్ట్రంలోని 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 30న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. జూలై 1న పరీక్ష నిర్వహించనున్నట్టు కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనున్నది.