హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అక్టోబర్ 31 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు టీఎస్పీఎస్సీ ఫైనల్ కీని విడుదల చేసింది. ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కులు ఇవ్వనున్నట్టు చైర్మన్ జనార్దన్రెడ్డి తెలిపారు. సబ్జెక్టు నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాత ఐదు ప్రశ్నలను తొలగించినట్టు పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం తొలగించిన ప్రశ్నల మార్కులను మిగిలిన ప్రశ్నల జవాబులకు జతచేస్తారు. ఆ ప్రాతిపదికన 145 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కుల చొప్పున జతచేస్తే 149.93 వస్తున్నాయి. అంటే.. ఎన్ని సమాధానాలు సరైనవి రాస్తే ఒక్కోదానికి 1.034 మార్కుల చొప్పున ఇస్తారు. గ్రూప్-1 తొలి స్టెప్ ప్రిలిమ్స్ ప్రక్రియ ఇంతటితో ముగిసినట్టే. ఇక మిగిలింది మెయిన్స్ పరీక్ష. మొత్తం 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పన మొత్తం 25,150 మంది అభ్యర్థులు మెయిన్స్కు సెలెక్ట్ అవుతారు. ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని గతంలోనే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ https://www.tspsc.gov.in వెబ్సైట్లో ఉన్నది. ఫైనల్ కీపై అభ్యంతరాలు స్వీకరించబోమని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.