600 మార్కులకు గ్రూప్-2 పరీక్ష
ఇంటర్వ్యూల రద్దు నేపథ్యంలో
నియామక విధానంలో మార్పులు
నేడు టీఎస్పీఎస్సీ ప్రత్యేక సమావేశం
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూలను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో, ఆయా పరీక్షల్లో మొత్తం మార్కుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నది. ప్రస్తుతం గ్రూప్-1లో రాత పరీక్షకు 900, ఇంటర్వ్యూకు 100 కలిపి మొత్తం వెయ్యి మార్కులు ఉన్నాయి. గ్రూప్-2లో రాత పరీక్షకు 600, ఇంటర్వ్యూకు 75 మార్కులు కలిపి 675 ఉన్నాయి. ఇంటర్వ్యూలు తీసేసిన నేపథ్యంలో గ్రూప్-1ను 900 మార్కులకు, గ్రూప్-2ను 600 మార్కులకే నిర్వహించే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటర్వ్యూ మార్కులను కలిపి పరీక్షలు నిర్వహించాలంటే పాత జీవోను సవరించాల్సి ఉంటుందని, దీనికోసం క్షేత్రస్థాయిలో ఎన్నో మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తుందని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్ష విధానంలో సమూల మార్పులు చేయటం సాధ్యం కానందున ఇంటర్వ్యూ మార్కులను పూర్తిగా తొలగించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పరీక్షల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు వస్తే.. ఇంటర్వ్యూల తర్వాత వాళ్లు ఐదు, ఆరో స్థానాలకు పరిమితమైన సందర్భాలున్నాయి. ఇంటర్వ్యూలను కొందరు ప్రభావితం చేసేవాళ్లనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని అప్పట్లో అసెంబ్లీలో ప్రస్తుత మంత్రి కే తారకరామారావు స్వయంగా లేవనెత్తారు కూడా. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1, 2లో నియామక ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఇంటర్వ్యూలను రద్దు చేసిందని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రక్రియ వేగవంతం…
ఇంటర్వ్యూల రద్దుతో ఉద్యోగ భర్తీ ప్రక్రియను రెండు, మూడు నెలల ముందే పూర్తి చేయవచ్చు. వివిధ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూలకు సగటున ఒక వ్యక్తికి అరగంట సమయం పడుతుంది. ప్రస్తుతం 503 ఉద్యోగాల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గత విధానం ప్రకారమైతే మెయిన్ పరీక్షల అనంతరం 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిస్తే 1,509 మందిని ఇంటర్వ్యూ చేయాలి. ఒకో అభ్యర్థిని అరగంట చొప్పున రోజుకు కనీసం 20 నుంచి 25 మందిని ఇంటర్వ్యూ చేసినా ఈ ప్రక్రియ పూర్తికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఇంటర్వ్యూల రద్దు నిర్ణయంతో అనుకున్న సమయం కంటే ముందే నియామక ప్రక్రియను పూర్తి చేయవచ్చని సర్కారు భావిస్తున్నది.
గ్రూప్-1పై నేడు టీఎస్పీఎస్సీ భేటీ
నోటిఫికేషన్ల జారీకి కసరత్తు ముమ్మరం చేసిన టీఎస్పీఎస్సీ, గ్రూప్ -1 నోటిఫకేషన్కు సన్నాహాలు చేస్తున్నది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నది. 503 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 19 శాఖల్లోని పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు ఇప్పటికే టీఎస్పీఎస్సీకి చేరాయి. ఒకటెండ్రు శాఖల్లో అర్హతలు, ఇతర అంశాలపై ఆయా శాఖల నుంచి స్పష్టత కోరారు. దీనిపై ఆయా అంశాలపై ఉన్నతాధికారులు స్పష్టతనిచ్చినట్టు తెలిసింది. అన్ని అంశాలు కొలిక్కి రావటంతో కమిషన్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమవుతున్నది. ఈ సమావేశంలో గ్రూప్ -1 నోటిఫికేషన్పైనే చర్చ జరిగే అవకాశమున్నట్టు సమాచారం. ఈ నెల 22న కమిషన్ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ రెండు సమావేశాలు ముగిసిన తర్వాత నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నట్టు తెలిసింది.