హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గ్రూప్-1 మెయిన్ పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జూన్ 5 నుంచి 12 వరకు ఏడు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. జూన్ 11న ఆదివారం పరీక్ష ఉండదు. పరీక్షలన్నీ హైదరాబాద్ (హెచ్ఎండీఏ పరిధిలో) కేంద్రంలో మాత్రమే నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ పరీక్షతోపాటు మరో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ 150 మార్కులకు ఉన్నప్పటికీ, అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని అనితా రామచంద్రన్ తెలిపారు. ప్రతి పేపర్కు 3 గంటల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు.
మూడు భాషల్లో పరీక్ష…
గ్రూప్-1 మెయిన్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ మినహా మిగిలిన 6 పేపర్లను మెరిట్ బేసిస్ మీద తీసుకుంటారు. జనరల్ ఇంగ్లిష్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇంగ్లిష్ పేపర్ మార్కులు మెయిన్ పరీక్ష మార్కుల్లో లెక్కించబడవు. తొలుత ఇంగ్లిష్ పేపర్ మూల్యాంకనం చేస్తారు. అందులో అర్హత మార్కులు సాధించకపోతే.. మిగిలిన పేపర్లు వాల్యుయేషన్ చేయరు. అభ్యర్థులు పరీక్ష కోసం ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ ఏదో ఒక భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. పేపర్లో కొంత భాగాన్ని ఇంగ్లిష్లో, కొంత భాగాన్ని తెలుగు లేదా ఉర్దూలో రాయడానికి అనుమతి లేదని, ఒకవేళ అలా ఎవరైనా రాస్తే వారిని అనర్హులుగా పరిగణిస్తామని అనితా రామచంద్రన్ తెలిపారు. జనరల్ ఇంగ్లిష్ పేపర్ క్వాలిఫయింగ్ కోసమే అని, దీనిలో ప్రశ్నలు సెకండరీ సూల్ లెవల్లోనే ఉంటాయని పేరొన్నారు. ఈ పేపర్లో వచ్చిన మారులు ర్యాంకింగ్ కోసం లెకించరని తెలిపారు. మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థి తప్పనిసరిగా అన్నింటికీ హాజరు కావాలని సూచించారు. ఏదైనా ఒక్క పేపర్కు హాజరు కాకపోయినా వారి ఇతర పేపర్లను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
తొలిసారి కంపల్సరీ క్వశ్చన్స్..
మెయిన్ పరీక్ష విధానంలో టీఎస్పీఎస్సీ ఈసారి కొన్ని మార్పులు తీసుకొచ్చింది. గతంలో ప్రతిదాంట్లో చాయిస్ ప్రశ్నలు ఉండేవి. ఈసారి కంపల్సరీ క్వశ్చన్స్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా, ప్రతి వ్యాసాన్ని తప్పనిసరిగా 1000 పదాలకు తగ్గకుండా రాయాలనే నిబంధన తీసుకొచ్చారు. గతంలో 600 నుంచి 800 పదాలలోపు రాస్తే సరిపోయేది. రాష్ట్రంలోనే అత్యున్నత క్యాడర్ కలిగిన పోస్టులు కాబట్టి, సమర్థంగా ఎంపిక చేయాలనే సదుద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్టు కమిషన్ తెలిపింది. పరీక్ష తేదీకి వారం రోజులు ముందుగా https://www.tspsc.gov.in వెబ్సైట్లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచుతామని అనితా రామచంద్రన్ తెలిపారు. గ్రూప్-1 ఎంపికల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలను తొలగించింది.