హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): వానలు కురువకపోవడం, రిజర్వాయర్లు అడుగంటడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలమట్టాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో వేసవిలోనే సగటు భూగర్భజలమట్టం 6.22 మీటర్లు కాగా, ప్రస్తుతం ఏకంగా 9.34 మీటర్లకు చేరుకోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం 9.34 మీటర్లు ఉండగా, 13 జిల్లాల్లో 10 మీటర్లకంటే ఎక్కువ లోతుకు చేరుకున్నాయి. ఇక కృష్ణాబేసిన్లో భూగర్భజలమట్టం ఆశించినంత మెరుగ్గా లేదు. కానీ గోదావరి బేసిన్లో మాత్రం పరిస్థితి ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. బేసిన్ పరిధిలోని చాలా జిల్లాల్లో భూగర్భజలాలు గతేడాదితో పోల్చితే గణనీయంగా పడిపోయాయి. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటినుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఆ ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ తదితర ప్రాజెక్టులను అనుసంధానించి అవసరం మేరకు ఎప్పటికప్పుడు జలాలను ఎత్తిపోశారు. ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న చెరువులను క్రమం తప్పకుండా నీటితో నింపారు. కానీ మేడిగడ్డ డ్యామేజీ పేరిట ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం ఆపేసింది. చెరువులు, చెక్డ్యామ్లలో నీరు లేక అడుగంటుతున్నాయి. హనుమకొండ, జనగామ, సిద్దిపేట మినహా గోదావరి బేసిన్లోని మిగిలిన అన్నిజిల్లాల్లో ఈ ఏడాది భూగర్భజలాలు లోతుకు పడిపోవడం గమనార్హం.
రీచార్జ్జి తక్కువ.. వాడుతున్నది ఎక్కువ
భూగర్భ జలమట్టం వేగంగా పడిపోవడానికి ప్రధానకారణం ఈ ఏడాది ప్రాజెక్టుల్లో ఆశించినస్థాయిలో నీరు రాకపోవడం, మరోవైపు చెరువులను నింపకపోవడమేనని తెలుస్తున్నది. వాస్తవంగా భూగర్భ జలమట్టాన్ని పెంచడంలో చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, చెక్డ్యామ్లు, ఇంకుడు గుంతలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో కాలువలు, చెరువుల ద్వారానే 10 శాతానికి పైగా భూగర్భజలమట్టం రీచార్జ్జి అవుతుంటుంది. చెరువులను నింపకపోవడం, కాలువల ద్వారా సాగునీటి సరఫరా లేకపోవడంతో ఆ మేరకు భూగర్భ జలాల రీచార్జి తగ్గిపోయింది. ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. ఎక్కడికక్కడ బోర్ల ద్వారా నీళ్లను తోడివేస్తుండడంతో వేగంగా భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని జలరంగ నిపుణులు చెప్తున్నారు. భూగర్భజలమట్టాలు పడిపోతుండడంతో నిన్నమొన్నటివరకు నిండుగా పోసిన బోరుబావులు ఇప్పుడు మొరాయిస్తున్నాయి. ప్రభుత్వం బరాజ్ల నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులు, ప్రాజెక్టులు నింపితే పరిస్థితి అదుపులోకి వస్తుంది. లేదంటే భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉన్నది.
