హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా నీళ్లకుండగా మారింది. గత ఏడాది కంటే రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భజల మట్టం పెరిగిన జిల్లాగా తొలిసారి రికార్డుకెక్కింది. గత ఏడాది నవంబర్తో పోల్చితే ఏకంగా 2.41మీటర్ల మేర భూగర్భ జల మట్టం పెరగడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది నవంబర్తో పోల్చితే ఈ ఏడాది భూగర్భ జల మట్టం 0.47మీటర్ల మేర పెరగా, 21 జిల్లాల్లో సగటున 0.13 మీటర్ల నుంచి 2.41 మీటర్లు పెరిగిందని రాష్ట్ర భూగర్భ జల విభాగం డైరెక్టర్ పండిత్ మడ్నూరె వెల్లడించారు. నవంబర్ నెల నివేదికను గురువారం విడుదల చేశారు.
నవంబర్లో రాష్ట్రంలో సరాసరి నీటి మట్టం భూ ఉపరితలం నుంచి 4.50 మీటర్లుగా నమోదయినట్టు వెల్లడించారు. 22 జిల్లాల్లో సరాసరి నీటి మట్టం 5 మీటర్ల కంటే తక్కువగా నమోదైందని ఆ నివేదికలో తెలిపారు. ఈ ఏడాది అత్యధికంగా నల్లగొండలో 2.41, జయశంకర్ భూపాలపల్లి జిల్లా 1.84, మెదక్ 1.64, మేడ్చల్ 1.63, మహబూబ్నగర్ 1.39 మీటర్లు పెరిగిందని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే 12 జిల్లాలో మాత్రమే 0.3 నుంచి 0.85 మీటర్ల మేరకు తగ్గుదల ఉన్నదని తెలిపారు.