నాగర్కర్నూల్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి సీజన్లో వేరుశనగ సాగు రైతులకు లాభాలు ఆర్జించి పెడుతున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు వరి, పత్తితోపాటు వేరుశనగ సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో యాసంగిలో ప్రధానపంటగా సాగవుతున్నది. పాలమూరులోని ఎర్రటి నేలలు వేరుశనగ సాగుకు అత్యంత అనుకూలమైనవి.
నల్ల నేలల్లో విత్తనం లోపలికి వెళ్లదు. ఎర్రనేలలు పొడిగా ఉండటంతో ఏపుగా పెరుగుతున్నది. ఈ నేలల్లో ఆఫ్లాటాక్సిన్ అనే శిలీంధ్రం ప్రభావం చాలా తక్కువ. దీంతో వేరుశనగ పూలు, కాయలు చక్కగా పెరిగి, అధిక దిగుబడిని ఇస్తాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పండిన వేరుశనగ కాయలు చాలా రుచిగా, అధిక నూనెశాతం కలిగి ఉంటాయి. ఈ నూనె ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. దీనిని ఔషధాల్లోనూ వినియోగిస్తారు.
దీంతో ఇతర రాష్ర్టాల వ్యాపారులు సైతం నాగర్కర్నూల్, వనపర్తి ప్రాంతాల్లో పండిన వేరుశనగను కొనేందుకు పోటీపడతారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉండటంతో మంచి ధర లభిస్తున్నది. వేరుశనగకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ.5,850 కాగా ఇక్కడి పంట రూ.9వేల దాకా పలుకుతున్నది.
రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే వర్షపాతం తక్కువ ఉండటం అనుకూలంగా మారింది. సీఎం కేసీఆర్ సాగునీరు, విద్యుత్తు రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో వేరుశనగ విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కూడా ప్రత్యేక చొరవ తీసుకొని రైతులను ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు కూడా రైతులకు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని నేలల ప్రత్యేక లక్షణం వల్లనే ఇక్కడ పండించే వేరుశనగకు అంతర్జాతీయంగా మంచి పేరు వచ్చింది. ఈ నేలలు ఎర్రగా ఉండటంతో పంట ఏపుగా పెరుగుతుంది. ఆఫ్లాటాక్సిన్ శిలీంధ్రం ప్రభావం లేకపోవడంతో కాయలు రుచిగానూ అధిక నూనె శాతం కలిగి ఉంటాయి. రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.
– వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి