MLA Rasamayi Balakishan | శంకరపట్నం, మే 12: బైక్ కొనివ్వలేదని ఓ పెం డ్లి కొడుకు ఏకంగా పీటల మీద పెండ్లిని ఆపేసిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్లో జరిగింది. సమయానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదుకోవడంతో వివాహ తంతు పూర్తయింది. వివరాలు ఇలా.. అంబాల్పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మి-మల్లయ్య దంపతుల కూతురు అనూష వివాహం సైదాపూర్ మండలం వెన్నెంపల్లికి చెందిన సంఘాల వినయ్తో ఇటీవల నిశ్చయమైంది. లాంఛనాల కింద రూ.5 లక్షలతోపాటు బైక్ ఒప్పుకొన్నారు. అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబమైనా అప్పోసప్పో చేసి పెండ్లికి ముందే రూ.5 లక్షలు ముట్టజెప్పారు.
శుక్రవారం మొలంగూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాలులో వివాహం జరగాల్సి ఉండగా ఆశీర్వదించడానికి ఎమ్మెల్యే రసమయి ఫంక్షన్ హాలులో అడుగు పెట్టారు. పెండ్లి బాజా మోగాల్సిన పచ్చని పందిట్లో వధువు, వరుడి కుటుంబాల మధ్య గొడవ జరుగుతున్నది. ‘బైక్ కొనిస్తేనే అమ్మాయి మెడలో తాళి కడుతా.. లేకపోతే వెళ్లిపోతా’ అంటూ పెండ్లి కొడుకు భీష్మించడంతో పెండ్లికూతురు, కుటుంబసభ్యులంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఎమ్మెల్యే రసమయి జోక్యం చేసుకొని పెండ్లి కొడుకుతో మాట్లాడి నచ్చజెప్పారు. బైక్ తాను కొనిస్తానని పెళ్లితంతును కొనసాగించాలంటూ రూ.లక్ష నగదును పెండ్లికొడుకు తండ్రి చేతిలో పెట్టాడు. పెండ్లికి అంగీకరించిన వినయ్.. అనూష మెడలో తాళి కట్టడంతో కథ సుఖాంతమైంది. ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి పెండ్లి కార్యక్రమాలను చూసుకోవడమేగాక తోబుట్టువులా చెల్లెలి పెండ్లికి కట్నంలా బైక్ కొనిచ్చి ఔదార్యాన్ని చాటారు. ఎమ్మెల్యేకు వధువు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.