హైదరాబాద్ : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మార్చి 11వ తేదీకి వాయిదాపడింది. వాస్తవానికి సమావేశం 4వ తేదీన జరుగాల్సి ఉండగా.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అదే రోజు పోలవరం పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో భేటీని వాయిదా వేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శలకు, ఇరిగేషన్ ఈఎన్సీలకు జీఆర్ఎంబీ మెంబర్ సెక్రెటరీ బీపీ పాండే సోమవారం లేఖ రాశారు.
సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చనకా – కొరాట బ్యారేజీ, చౌట్పల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్ స్కీంపై చర్చించి అనుమతులు ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీనితో పాటు బోర్డు బడ్జెట్ ప్రతిపాదనలపైనా సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిరుడు జూలై 15న జారీ చేసిన బోర్డు గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చలు జరుపనున్నారు.