హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): పెద్దవాగు మినహా గోదావరిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ అప్పగించాలని తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఎదుట గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ప్రతిపాదించింది. గురువారం నిర్వహించనున్న సబ్కమిటీ సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. మీటింగ్కు సంబంధించిన ఎజెండా అంశాలను ఇరు రాష్ర్టాలకు జీఆర్ఎంబీ అందజేసింది.
ఏప్రిల్లో నిర్వహించిన బోర్డు సమావేశంలో గెజిట్ ప్రకారం ఇరు రాష్ర్టాలు ప్రాజెక్టుల నిర్వహణ కోసం రూ.200 కోట్ల చొప్పున సమకూర్చాల్సిన సీడ్మనీ, ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన ఉద్యోగుల కేటాయింపు, వార్షిక బడ్జెట్ అంశాలను ఎజెండాలో చేర్చారు. అదేవిధంగా కేంద్రం జారీచేసిన రివర్ బోర్డుల గెజిట్ ప్రకారం ఇరు రాష్ర్టాల ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను జీఆర్ఎంబీకి అప్పగించాల్సి ఉంటుంది. అందులో భాగంగా గెజిట్లోని షెడ్యూల్2లో పొందుపరచిన ప్రాజెక్టులను అప్పగించాలని ఇరు రాష్ర్టాలకు బోర్డు సూచించింది. దానిపై కూడా సబ్కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. జీఆర్ఎంబీ ప్రతిపాదించిన ప్రాజెక్టుల జాబితాపై ఇరు రాష్ర్టాల అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిపై తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు. ఇరు రాష్ర్టాలు ఆది నుంచీ ఆ ప్రాజెక్టు మినహా మరే ప్రాజెక్టును బోర్డుకు అప్పగించబోమంటూ పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సబ్కమిటీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.