ఆదిలాబాద్ : తెలంగాణలో మావోయిజం ( Maoism ) అంతరించిందని డీజీపీ సీవీ ఆనంద్ ( DGP Anand ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక గ్రేహౌండ్స్ ( Greyhounds ) ను ఆహార కల్తీ నియంత్రణ కోసం, ట్రాఫిక్ మేనేజ్మెంట్కు వినియోగిస్తామన్నారు . లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రెండు నెలలుగా ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గాయని వివరించారు. 44వ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగటానికి అక్రమ పార్కింగ్ అని తమ విచారణలో తెలిందని అన్నారు. ప్రమాదాల నియంత్రణకు పోలీసులకు, ప్రజలు సహకారం అందించాలని కోరారు. వేగం తక్కువగా ఉండేలా వాహానదారులు వాహనాలు నడుపాలని సూచించారు .
గంజాయి, డ్రగ్ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా డ్రగ్స్కు తెలంగాణ యువకులు బానిసలు కావద్దన్నారు. ఆదిలాబాద్ జిల్లా పొలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని, ఇతర జిల్లాల మాదిరిగా జిల్లా పోలీసులపై ఫిర్యాదులు లేవన్నారు. భూపాలపల్లి,ఆదిలాబాద్, ఆసిఫాబాద్ , ములుగు జిల్లాలో గంజాయి ఎక్కువగా సాగు చేస్తున్నారని, జిల్లాలో గంజాయి సాగు చేసిన నూట పది మంది రైతులకు రైతు భరోసా నిలిపివేసినట్లు తెలిపారు.