నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 6: భారత రాష్ట్ర సమితిని స్వాగతిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. పొరుగు రాష్ర్టాలు మహారాష్ట్ర, కర్ణాటకలోనూ అక్కడి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మహారాష్ట్రలోని సిరొంచ పట్టణ సమీపంలోని ధర్మపురి గ్రామం వద్ద జాతీయ రహదారిపై గ్రామస్థులు పటాకులు కాల్చారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) బలోపేతం కోసం ఇప్పటికే చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ను కలిశామని తెలిపారు.
కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా కేంద్రంలోని గంజ్ సర్కిల్లో ‘దేశ్కా నేత కేసీఆర్’ ఫ్లెక్సీని యువకులు ఏర్పాటు చేశారు. దేశాభివృద్ధికి కేసీఆర్ నడుం బిగించడంపై హర్షం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్కు విరాళాలు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)కు చెందిన ఆసరా పింఛన్ల లబ్ధిదారులు 50 మంది రూ.50 వేలను టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు ప్రకటించారు. రైతులు రూ.66 వేలు, పింఛన్ లబ్ధిదారులు రూ.50 వేలు.. మొత్తం రూ.1.16 లక్షలను సర్పంచ్ మీనాక్షీగాడ్గేకు అందజేశారు.
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం స్వాగతించదగిన పరిణామం. నూతన పార్టీల వల్ల పోటీ పెరిగి పనితీరును మరింత మెరుగుపరుచుకోవచ్చు. కొత్త పార్టీల రాకపై మా పార్టీలో విశ్లేషించలేదు. అభివృద్ధిపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదే.
– వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
75 ఏండ్లుగా దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీలు పేరుకే వేర్వేరు పార్టీలు. వాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక విధానాలన్నీ ఒక్కటే. కేంద్రంలో ఇప్పుడున్నది ఫాసిస్ట్ ప్రభుత్వం. దానిని నిలువరించడం అత్యవసరం. ఆ శక్తి నేడు కాంగ్రెస్కు లేదు. అనుభవజ్ఞులు ఆ పార్టీలో ఉన్నా మోదీని ఢీకొట్టే సత్తా వారికి లేదు. కేసీఆర్ గొప్ప అడ్మినిస్ట్రేటర్. కచ్చితంగా ప్రభావం చూపుతారు.
– జాన్ జోసెఫ్, కొచ్చి, రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ (కేరళ)
కాంగ్రెస్, బీజేపీ పార్టీల విధానాలన్నీ ఒక్కటే. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ రావాల్సిన అవసరమున్నది. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే, ప్రజల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన, చొరవ చూపే నాయకుడు కావాలె. ఆ లక్షణాలు కేసీఆర్లో పుష్కలంగా ఉన్నాయి. తాగు, సాగునీటి కల్పన, పారిశ్రామిక అభివృద్ధిలోనూ దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపారు. కేసీఆర్ ఇప్పుడు దేశానికి కావాలె.
– సుబ్రహ్మణ్యం, నీటిరంగ నిపుణుడు (చెన్నై)
తెలంగాణ ప్రభుత్వం పాలనా విధానాలు భేష్. నీటి సంరక్షణ ప్రణాళికలు అద్భుతం. నీటి కుంటలు, చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణంలో ముందున్నది. వ్యవసాయంతోపాటు పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడుతున్నది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. కేసీఆర్ దేశ యువతకు మార్గదర్శి.
– జూబి, యువ జల్ బిరదారి (అస్సాం)