హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారి కుటుంబాల్లో సంతోషం ఉండేలా వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాల కుటుంబాలకు అన్ని వేళలా ప్రభుత్వం బాసటగా నిలుస్తున్నదని చెప్పారు.
సోమవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికులకు సంక్షేమంలో భాగంగా నెలకు రూ.2,016 చొప్పున తెలంగాణ ప్రభుత్వం పింఛన్ అందజేస్తున్నదని వెల్లడించారు. బతుకమ్మ చీరల ద్వారా నేత కార్మికులకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. నేతన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రయోజనం కల్పించామని పేర్కొన్నారు. నేతన్నకు చేయూత పథకం అమలు చేస్తూ వారి ఆదాయం పెరిగేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వ పథకాలు చేనేత కార్మికులకు నేరుగా చేరేలా మగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. చేనేత మిత్ర ద్వారా నూలు, సిల్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 20 శాతం నుంచి 40 శాతానికి పెంచామని తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికుల రూ.28.96 కోట్ల రుణాలను మాఫీ చేసిందని, పావలా వడ్డీ ద్వారా రూ.120 కోట్ల రుణాలను 523 సొసైటీలకు అందించిందని వివరించారు. చేనేత పాలసీ, చేనేతదారులకు పవర్ లూమ్ మగ్గాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి చీరలు నేయించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. చేనేత కార్మికుల అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషి మంచి ఫలితాలను అందిస్తున్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.