హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని అధిగమించిందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 239 కోట్ల మొక్కలు నాటినట్టు వివరించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.6,555.97 కోట్లు ఖర్చుచేసినట్టు వివరించారు. శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 3.67 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఎంపీ సంతోష్కుమార్ కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా హరితభావజాల వ్యాప్తికి కృషిచేస్తున్నారని అభినందించారు.
హరితనిధిపై టీజీవో హర్షం
హరితహారంలో ఉద్యోగులను భాగస్వాములను చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హరితనిధిని ఏర్పాటు చేయడంపై టీజీవో హర్షం వ్యక్తంచేసింది. ఇందుకు సీఎం కేసీఆర్కు టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు.