AICTE | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుపై విధించిన మారటోరియాన్ని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. కొత్త కాలేజీల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం బుధవారం కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో 2023 -24 విద్యా సంవత్సరం అప్రూవల్ హ్యాండ్బుక్ను విడుదల చేసిన అనంతరం ఆయన ఆన్లైన్లో ప్రసంగించారు. ఈ ఏడాది ఆశావహ జిల్లాల్లో కొత్త కాలేజీల ఏర్పాటు, ఆయా ప్రాంతాల్లో సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. యాజమాన్యాలు నేషనల్ సింగిల్విండో సిస్టం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, గురువారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని వివరించారు. ఏప్రిల్ 6 వరకు కాలేజీల యజమాన్యాలు దరఖాస్తు చేసుకోవవచ్చని పేర్కొన్నారు.
ఏఐసీటీఈ నూతన మార్గదర్శకాలు
కొత్త కోర్సులు
ఈ విద్యాసంవత్సరం ఏఐసీటీఈ వివిధ కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. కోర్ కోర్సుల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేన్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. మైనర్ డిగ్రీ అయిన ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో వీఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ కోర్సులున్నాయి. పీజీడీఎం కోర్సుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, ల్యాండ్ గవర్నెన్స్, వాటర్ అండ్ రివర్ మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఇన్నోవేషన్ ఎంట్రర్ప్రెన్యూర్షిప్ అండ్ వెంచర్ డెవలప్మెంట్, వీఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, 5జీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులకు అండర్ గ్రాడ్యుయేట్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది.