Polygon Technology | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ‘పోడు’భూముల పంపిణీ ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకంతో 4 లక్షల ఎకరాలకు పట్టాలు, 1,55,393 మందికి లబ్ధిచేకూరనున్నది. ఒకసారి పోడుపట్టాల పంపిణీ తరువాత అటవీభూమి ఒక ఇంచుకూడా అన్యాక్రాంతం కాకుండా ఉండేదుకు పాలిగన్ (POLYGON) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. భూమి సర్వే నంబర్, పంపిణీ చేసే భూమి విస్తీర్ణం, ఆ భూమి ఏ అక్షాంశ, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూమి హద్దులు ఏవి? వంటి అంశాలను గూగుల్ మ్యాపింగ్ వివరాలతోపాటు హోలోగ్రామ్ను పోడుపట్టాలో పొందుపరచనున్నారు.
పంపిణీ చేసిన తరువాత భవిష్యత్లో ఇరుగుపొరుగువారితో భూహద్దు వివాదాలు తలెత్తకుండా ఉండటం, లబ్ధిదారుడి భూమి పక్కనే అటవీ భూమి ఉంటే కాలక్రమేణా ఆ భూమిని లబ్ధిదారుడు ఆక్రమించుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పాలిగన్ టెక్నాలజీని వినియోగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నూతన సచివాలయం తమ జీవితాల్లో కొత్తవెలుగులు ప్రసరింపజేపసిందని పోడురైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 12,49,296 ఎకరాలకుగాను 4,14,353 క్లెయిమ్స్ను ఫారెస్ట్ కమిటీలు వివిధస్థాయిలో పరిశీలించిన అనంతరం 4,00,903 ఎకరాలకు సంబంధించి 1,55,393 మంది లబ్ధిదారులు పోడుపట్టాలకు అర్హత సాధించారు. సాధ్యమైనంత తొందరగా పోడుభూములకు పట్టాలు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.