హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతిఊరిలో, ప్రతి గుడిలో నాటించాలన్న సంకల్పం తీసుకున్నది. దసరా పండుగనాడు లాంఛనంగా జమ్మి మొకలను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను స్వర్ణగిరి అలయ పూజారి చేతుల మీదుగా రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ శుక్రవారం ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో జమ్మి మొక్కను నాటారు. వేదకాలం నుంచి భక్తిపూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మిచెట్టును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా నాటి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అయితే, అనేక కారణాలతో జమిచెట్టు అంతరించిపోతున్న నేపథ్యంలో దాని విశిష్టత రీత్యా ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో పెంచాలన్న లక్ష్యంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ తరఫున ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని సంతోష్కుమార్ తీసుకున్నారు.
తెలంగాణలో దసరానాడు జమ్మిచెట్టును పూజించడం ఆచారమని, జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఆనవాయితీ అని సంతోష్కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రాధాన్యం దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు-గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే పదివేలకుపైగా జమ్మి మొకలను సిద్ధం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, గుడులకు వీటిని పంపిణీ చేస్తామని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కోఫౌండర్ కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ.. వేదకాలం నుంచి నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ప్రతి ఊరిలో, గుడిలో, బడిలో పెంచాలన్న గొప్ప ఆలోచన చేసిన సంతోష్కుమార్కు అభినందనలు తెలియజేశారు.