హైదరాబాద్ : ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’(Green India Challege) లో ప్రఖ్యాత బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంపీ సంతోష్ కుమార్( MP Santosh Kumar) తో కలిసి మొక్కను నాటారు. శ్రేయా ఘోషల్ (Shreya Goshal ) మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ గొప్ప సామాజిక కార్యక్రమమని అన్నారు. దీనిలో పాల్గొని మొక్కను నాటడం ఆనందంగా ఉందన్నారు.
అన్ని బాధ్యతల కన్నా సామాజిక బాధ్యత( Social Responsibility) మిన్న అని, సమస్త మానవజాతి మనుగడకు మొక్కలే జీవనాధారమని పేర్కొన్నారు. మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం(Greenary) పెరిగి పర్యావరణ పరిరక్షణ(Environmental Protection ) సాధ్యమవుతుందన్నారు. ప్రకృతికి, పాటకు విడదీయలేని అనుబంధం ఉందని, ఆ రెండింటి సమన్వయంతో మనం సంపూర్ణ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటామన్నారు.
మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సంతోష్ కుమార్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి తన ట్విట్టర్ ద్వారా మరో ముగ్గురికి ఛాలెంజ్ ను విసురుతున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ‘ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కరుణాకర్ రెడ్డి, రాఘవేందర్ యాదవ్ పాల్గొన్నారు.