హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సోలాపూర్లోని పాండురంగ దేవాలయంలో తొలిఏకాదశి పురస్కరించుకుని భక్తులకు 10,116 తులసి మొక్కలు అందించారు. పాండురంగ విఠలునికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మొక్కలు ఇవ్వటం సంతృప్తిగా ఉన్నదని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు. సంత్తుకారాం మహరాజ్ తన బోధనలలో చెప్పిన ప్రకృతి నియమాలకు, ప్రకృతి పరిరక్షణకు అనుగుణంగా భక్తులకు తులసి మొక్క పంపిణీ చేసినట్టు చెప్పారు. మహారాష్ట్రలో వార్కరీ సంప్రదాయం 13వ శతాబ్దం నుంచి కొనసాగుతున్నదని, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తులసీమాలలతో యాత్రగా తొలిఏకాదశి నాడు పండరిపురానికి చేరుకుంటారని వెల్లడించారు. ఈ పవిత్రమైన రోజున భక్తులకు భక్తిమార్గంతోపాటు ప్రకృతి పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాలనే ఆశయాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ మెంబర్ రాఘవ, పూర్ణ, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.