Indrakaran Reddy | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి లండన్లోని గ్రీన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రతిష్ఠాత్మక గ్రీన్ యాపిల్ అవార్డు లభించడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అపూర్వ గౌరవమని మంత్రి తెలిపారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కడం మనందరికి గర్వకారణమని పేర్కొన్నారు.
స్వయంభువుగా వెలిసిన 13వ శతాబ్దంనాటి స్వామివారి విగ్రహానికి ఎటువంటి నష్టం జరగకుండా, ప్రధాన ఆలయంలోకి సహజ సిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా, ఆలయ పరిసరాల్లో 40 శాతం గ్రీనరీతో విద్యుత్తు వినియోగాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడంతో అంతర్జాతీయ అవార్డు లభించినట్లు మంత్రి వెల్లడించారు. సీఎం కేసిఆర్ మార్గనిర్ధేశంలో ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి ఈ సందర్భంగా మంత్రి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.