హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం తెలంగాణకు కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ)తోపాటు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ రాయదుర్గ్లోని నాలెడ్జ్ సిటీలో సీఎఫ్సీ ఏర్పాటుకయ్యే రూ.104.63 కోట్లలో గ్రాంట్ ఇన్ ఎయిడ్గా రూ.75 కోట్లు అందజేయనున్నట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈఎంసీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ఆమోదించామని, ఈ ప్రాజెక్టుకు అయ్యే రూ. 568.9 కోట్ల వ్యయంలో రూ.264.6 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందజేయనున్నామని తెలిపింది. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రం అందించిన సహకారంతోపాటు ఐటీఐఆర్ పురోగతిపై సమాచారం ఇవ్వాలని సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవికుమార్ కోరడంతో కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది.
కేంద్రానికి కేటీఆర్ లేఖలు
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి గత కేసీఆర్ ప్రభుత్వం విస్తృత కృషి చేసింది. అందులో భాగంగా మహేశ్వరంలో 2 ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను, మహబూబ్నగర్లోని దివిటిపల్లిలో మరో ఎలక్ట్రానిక్స్ క్టస్లర్ను ఏర్పాటు చేయడంతోపాటు ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలోనే రాయదుర్గ్లో సీఎఫ్సీ, దివిటిపల్లిలో ఈఎంసీ ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, ఐటీఐఆర్ ప్రాజక్టును పునరుద్ధరించాలని కోరుతూ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాయడమే కాకుండా స్వయంగా కేంద్ర మంత్రులనూ కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపడుతున్నది.