Telangana | హైదరాబాద్ : ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించి దేశ వైద్య రంగంలోనే సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా చివరి దశ 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శనివారం ఉత్వర్వులు జారీ చేసింది.
8 కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం రూ. 1,447 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధులతో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు, ల్యాబ్స్, సెమినార్ హాల్స్, అనుబంధ ఆసుపత్రి భవనాలు, హాస్టల్ భవనాల నిర్మాణం, ఇతర వసతులను కల్పించనున్నారు.
గద్వాల్, నర్సంపేట్ (వరంగల్), యాదాద్రిలో నిర్మించే కాలేజీలకు రూ. 183 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్ (మేడ్చల్ మల్కాజ్గిరి)కు రూ.182 కోట్లు, నారాయణ్ పేట్, ములుగు, మెదక్లోలో నిర్మించే కాలేజీలకు రూ. 180 కోట్ల చొప్పున, మహేశ్వరం మెడికల్ కాలేజీకి రూ.176 కోట్లు కేటాయించింది. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి అరోగ్య శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు అధ్యయనం చేసి కాలేజీల నిర్మాణానికి రూ. 1447 కోట్ల అంచనా ప్రతిపాదనలు సమర్పించారు. వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2014 వరకు తెలంగాణలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగా శుక్రవారం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరింది. వచ్చే ఏడాదికి గాను మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరుకుంది.
8 కాలేజీల నిర్మాణానికి రూ. 1,447 కోట్లు నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి పాలనలో జిల్లాకొక డిగ్రీ కాలేజీలు కూడా లేని పరిస్థితి. వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మారిన రోజులు. ఇక అదంతా గతం. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేసుకున్నాం. ఏటా 10వేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి చేరుకున్నాం. వచ్చే ఏడాదిలో ప్రారంభించే 8 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి, ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ ప్రజలకు వైద్యం, వైద్య విద్య కష్టాలను దూరం చేసిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుంది. బీఆర్ఎస్ సర్కార్ పాలనలో తెలంగాణ మెడికల్ హబ్ గా అవతరించింది అని హరీశ్రావు పేర్కొన్నారు.