సుల్తాన్బజార్, ఫిబ్రవరి 6: దేవాలయ అర్చక, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుదేనని తెలంగాణ దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి అన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. దేవాలయ అర్చక, ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను ఇటీవల కోరామని, ఆ సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ఇంద్రకరణ్రెడ్డిని కోరారు. దీంతో మంత్రి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు తగిన ఆదేశాలను జారీచేశారని చెప్పారు. ఈ నెల 8 నుంచి 11 వరకు సికింద్రాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్లు అర్హులైన అర్చక, ఉద్యోగుల వివరాలను సేకరించే పనులు ప్రారంభించనుండటం సంతోషించ దగ్గ విషయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5,625 మంది అర్చక, ఉద్యోగులున్నారని, 2017లో సీఎం కేసీఆర్ ప్రత్యేక జీవో ద్వారా వీరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతాలు చెల్లించాలని ఆదేశాలివ్వటంతో ప్రస్తుతం 2,761 మందికి ఆ విధానంలో వేతనాలు లభిస్తున్నాయని గుర్తుచేశారు. మిగిలిన 2,864 మందికి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్తో వేతనాలు చెల్లించే ప్రక్రియను ప్రారంభించటంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.