మిర్యాలగూడ రూరల్, మే 16 : పొలంలో బోరు పక్కన ఏర్పడిన గుంతలో మనుమడు పడిపోగా కాపాడబోయిన తాత మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లికి చెందిన కంటు పెద్ద వెంకన్న, నాగమ్మ కూతురు శ్రావణిని పదేండ్ల క్రితం నిడమనూరు మండలం నారమ్మగూడేనికి చెందిన నాగబోయిన అంజయ్యకు ఇచ్చి వివాహం చేశాడు. వారికి కొడుకు హిమాన్షు, కూతురు లోహిత ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పది రోజుల క్రితం పిల్లలు అమ్మమ్మ ఇంటికి వచ్చారు. శనివారం ఉదయాన్నే తాత వెంకన్న పొలానికి వెళ్తుండగా ఆయన వెంట ఇద్దరు పిల్లలు కూడా వెళ్లారు.
తాత పొలం వద్ద పనిలో నిమగ్నంకాగా మూడేండ్ల హిమాన్షు ఆడుకంటూ బోరుబావి పక్కన ఉన్న 12 అడుగుల గుంతలో పడిపోయాడు. గమనించిన తాత మనుమడిని కాపాడే క్రమంలో ఆదే గుంతలో తలకిందులుగా పడిపోయాడు. అక్కడే ఉన్న మనుమరాలు సమీపంలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా..వారు ఘటనా స్థలానికి చేరుకుని సైదులు అనే యువకుడి కాళ్లకు తాడు కట్టి తలకిందులుగా గోతిలోకి దించి వెంకన్న, బాలుడిని వెలికి తీయించారు. వీరిని మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా వెంకన్న మృతిచెందాడు. హిమాన్షు సురక్షితంగా ఉన్నాడని, మృతుడి భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.