హైదరాబాద్ : రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్కు అక్కడ ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు, పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. ఎయిర్పోర్టులో మంత్రి కేటీఆర్కి పుష్పగుచ్ఛాలు అందించి, అందించి స్వాగతం తెలిపారు.
ఆ తర్వాత లాస్ ఏంజిల్స్లో తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి సంబంధించి వివరాలను తెలిపారు. ఎన్నారైలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. మంత్రి కేటీఆర్ వెంట టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఉన్నారు.