హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతిభవన్లో ఘనంగా జరిగాయి. తొలుత ప్రగతిభవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుటుంబసమేతంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో జమ్మిచెట్టుకు శమీపూజ నిర్వహించిన పూజారులు విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు.
శుభసూచకంగా భావించే పాలపిట్టను సీఎం దర్శనం చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం దసరా నాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహనపూజలో మనుమడు హిమాన్షును తోడ్కొని సీఎం పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధపూజలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం కర్ణాటకలోని శృంగేరిపీఠం నుంచి తీసుకొచ్చిన శారదాదేవి నవరాత్రోత్సవ ప్రసాదాన్ని ముఖ్యమంత్రి దంపతులకు పూజారులు అందజేశారు. సీఎం కేసీఆర్కు కశ్మీర్లోని శారద స్వరజ్ఞపీఠం దేవాలయ జ్ఞాపికను తెలంగాణ మాసపత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్రావు అందజేశారు.